హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మోదీ పన్నాగానికి బెదరబోనని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో.. ఆమెకు అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతున్నది. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కవిత నివాసం వద్దకు తరలివస్తున్నారు. బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంబంధం లేని వ్యవహారంలో కవితకు క్లారిఫికేషన్ నోటీసు ఇవ్వడం ద్వారా ప్రజల్ని గందరగోళపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు.
తాము అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతుచూస్తామని బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని, తాము కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని వారు మరిచిపోయినట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితపై కుట్రపూరితంగా సీబీఐని ఉసిగొల్పినా తేల్చుకుంటామని ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు తేల్చిచెప్పారు. సీబీఐ, ఈడీ, ఐటీయే కాదు వాటి జేజమ్మలు దిగివచ్చినా టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు ఉన్న ప్రజాదరణను ఏమీ చేయలేరని అన్నారు.
ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్. వియ్ నెవర్ ఫియర్’ అనే నినాదంతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై సీబీఐ అభియోగం అని ఆయన పేర్కొన్నారు.