PM Modi | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి విడదీయలేని బంధం ఉన్నది. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో మోదీ పర్యటిస్తున్నారంటే.. ఆయన వచ్చే ముందో, ఆ తర్వాతో కచ్చితంగా ఆ రాష్ట్రంలో ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం, ఆయా రాష్ర్టాల్లోని అధికార పార్టీ నేతలను లేదా బీజేపీని విమర్శిస్తున్న నేతలను, వారికి అండగా నిలుస్తున్న సంస్థలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది.
ఇప్పుడు తెలంగాణలో జరిగింది కూడా ఇదే. మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించేందుకు మోదీ శుక్రవారం తెలంగాణకు రాకముందే ఈడీ అధికారులు వాలిపోయారు. ఆ రోడ్షో ముగిసేలోగా కవితను అరెస్ట్ చేశారు. బీజేపీయేతర రాష్ర్టాలన్నింటిలోనూ ఇదే తంతు కొనసాగుతున్నది. మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటనల సమయంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది.