MLC Kavitha | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. న్యాయమే గెలుస్తుందని, తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. నిర్దోషిగా బయటకు వస్తానని, కేవలం రాజకీయ కుట్రతో తనను అరెస్టు చేశారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని అడ్డం పెట్టుకొని కక్ష సాధిస్తున్నదని, ఇవన్నీ తాత్కాలికమైన అడ్డంకులని, వీటిని అధిగమిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నదని, తప్పకుండా న్యాయం గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈడీ కార్యాలయం నుంచి రౌస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్తున్నపుడు, కోర్టు హాలు వద్ద, రిమాండ్కు తరలించే సందర్భంగా కవిత అచంచలమైన ఆత్మవిశ్వాసంతోనే కనిపించారు. రిమాండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత భర్త, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత తన వ్యక్తిగత సహాయకుడు శరత్తో మాట్లాడుతూ భారత జాగృతి సేవల్లో ఎక్కడాలోటు రానివ్వవద్దని, నిజామాబాద్ దవాఖాన తదితర ప్రాంతాల్లో జాగృతి అందించే భోజన వసతి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించాలని చెప్పారు. భారత జాగృతి తరఫున ఇప్పటికే రూపొందించిన కార్యక్రమాలను నిర్వహించాలని, ఎక్కడా తాను అందుబాటులో లేనన్న భావన కార్యకర్తల్లో రానివ్వవద్దన్నారు. ఈడీ అధికారులు, కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దారిపొడవున ప్రత్యేకంగా రోప్పార్టీలను నియమించారు.
ఈడీ కార్యాలయంలోనే వైద్యపరీక్షలు
కవితకు ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్లోనే శనివారం ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల బృందాన్ని ఈడీ కార్యాలయానికి రప్పించిన అధికారులు అక్కడే ఆమెకు సాధారణ పరీక్షలు చేశారు. అనంతరం ఉదయం 11 గంటల ప్రాంతంలో రౌస్ ఎవెన్యూ న్యాయస్థానంలో ఆమెను హాజరుపరిచారు. ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి అనుమతితో కవిత తరఫు న్యాయవాది విక్రం చౌదరి ఆమెతో ప్రత్యేకంగా ఐదు నిమిషాలు మాట్లాడారు. మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు జరిగాయి. వాదనలు జరుగుతున్నంత సేపు కవిత కక్షిదారుల కోసం కేటాయించిన స్థలంలోనే కూర్చున్నారు. భోజన విరామం సమయంలో ఆమెను సందర్శకుల గ్యాలరీ వైపు వెళ్లేందుకు అనుమతించారు. అక్కడ కవిత భర్త అనిల్, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, జాగృతి నేతలు రాజీవ్సాగర్. శరత్, న్యాయవాదులు భరత్, రామచందర్రావు, మోహిత్కు ఆమె అభివాదం చేశారు. కవిత చుట్టూ బందోబస్తుకు వచ్చిన పోలీసులు సందర్శకులు ఎవ్వరూ కస్టడీలో ఉన్న వ్యక్తులతో మాట్లాడవద్దని చెప్పడంతో వారు అభివాదం మాత్రమే చేశారు. తిరిగి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. అనంతరం కవితను రిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించిన జడ్జి అయిదు గంటలకు ఉత్తర్వులు జారీచేశారు. ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి ఇస్తున్నామని, 23వ తేదీ మధ్యాహ్నం మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నపుడు భర్త, కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు సమయం ఇస్తామని, ఇంటి భోజనం అనుమతిస్తామని, వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులను తెప్పించుకోవచ్చని చెప్పారు. వైద్యులు పరీక్షించినపుడు కవిత హైబీపీతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
న్యాయపరంగా ఎదుర్కోవడంపై చర్చ..
ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్న తీరు, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కవిత తరఫు న్యాయవాదులు సుధీర్ఘంగా చర్చించారు. శనివారం ఇదే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టుకు ఈ సమయంలో వెళ్లడం కరెక్టా.. కాదా అన్నదానిపై చర్చించారు. దీనిపై ఆదివారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
అన్యాయంగా అరెస్టు చేశారు: సురేశ్రెడ్డి
ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అన్యాయంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి చెప్పారు. కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితమైనదని, సుప్రీంకోర్టులో ఒకవైపు విచారణ జరుగుతున్నపుడు మరోవైపు ఆమెను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం ఒక్కరోజు ముందు ఎలా అరెస్టు చేస్తారని, ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ న్యాయపరంగానే ఎదుర్కొంటుందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది: ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నదని, దీంట్లో భాగంగానే కవితను అరెస్టు చేశారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ఈడీ విచారణపై అనేక అనుమానాలున్నాయని, ఆ సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదని అన్నారు. న్యాయస్థానంలో తమ వాదన గెలుస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.
నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంరెడ్డి తదితరులు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కవితతో భేటీ అనంతరం న్యాయవాదులు, నిపుణులతో కూడా మాట్లాడుతారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి వస్తారని తెల్సింది. న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనే వీరు ప్రధానంగా దృష్టిసారించనున్నారు.