మోర్తాడ్, నవంబర్ 15 : కాంగ్రెస్ను నమ్మితే గోస పడుడే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపోళ్లు వారే గెలువాలని కోరుకుంటారని.. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలు గెలువాలని కోరుకుంటుందని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడపడంతోపాటు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపోళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి కానీ, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. ‘కాంగ్రెసోళ్లు వచ్చి చందమామను మీఇంటి మీద పెడతాం’ అనేలా మాటలు చెబుతారని, వారి మాటలు నమ్మితే మళ్లీ గోసపడక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో ఇంత అభివృద్ధి, ఇంతటి శాంతి ఉన్నదా? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. కర్ణాటకలో గెలిచిన తరువాత ఒక్క గ్యారెంటీని కూడా తీర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నదని, వాళ్లు చెప్పడం తప్ప చేసేదేమీ లేదని తెలిసిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక తండ్రిలాగా కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలకు అందిస్తున్నారని, తిరిగి బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్ను బలపరచాలని కోరారు. బాల్కొండలో వేముల ప్రశాంత్రెడ్డి గెలిస్తేనే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు, నూతన మ్యానిఫెస్టో ప్రకారం అమలవుతాయని తెలిపారు.
అక్కడ చేయనోళ్లు ఇక్కడ చేస్తారా?: వేముల
ఇతర రాష్ర్టాల్లో అధికారంలో ఉండి చేయని కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఇది చేస్తాం.. అది చేస్తామని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని, అధికారం ఉన్న దగ్గర చేయని వాళ్లు లేని దగ్గర ఎట్ల చేస్తారో ప్రజలు ఆలోచించాలని మంత్రి ప్రశాంత్రెడ్డి సూచించారు. కర్ణాటకలో గెలిచిన నెలకే గ్యారెంటీలు అమలు కాని పరిస్థితి ఉన్నదని, అక్కడి వారు కరెంటు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఇటు మహారాష్ట్రలో బీజేపీ పాలనలో కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. ‘తెలంగాణ రాక ముందు మనం ఎట్ల ఉన్నం? తెలంగాణ వచ్చినంక ఎట్ల ఉన్నమో?’ ఒకసారి ఆలోచించాలని కోరారు.