స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 7: వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల అనవసరంగా పాదయాత్రలతో సమయం, శక్తి, వనరులను వృథా చేసుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలో సమైక్య వాదంతో తిరిగిన షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తానంటే ఇక్కడి ప్రజలు అంగీకరించరని కడియం స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీబీఐ కేసులో జైలుకు పోగా షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేస్తే వైఎస్ జగన్ సీఎం అయ్యాడని, తరచూ వారి ఇంట్లో గొడవలు జరగడంతో షర్మిల, జయమ్మను జగన్ పక్కన పెట్టారని కడియం అన్నారు. జగన్ వల్ల షర్మిలకు అన్యాయం జరిగితే ఆమె ఆ ప్రాంతంలోనే పాదయాత్రలు చేసి అక్కడి ప్రజలకు చెప్పుకొంటే బాగుంటుందని, కానీ ఇక్కడ పాదయాత్రలు చేస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. జగన్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నదని తెలిపారు. ఒక వేళ జగన్ జైలుకు పోతే షర్మిల సేవలు అక్కడే ఉపయోగపడతాయని అన్నారు. వైఎస్సార్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని, తెలంగాణపై ఆ కుటుంబానికి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు.