Rythu Bandhu | జగిత్యాల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, వేలు, వందల ఎకరాలున్న వారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసంగానే ఉన్నదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితమైన ఆలోచన చేస్తున్నదని చెప్పారు. సేద్యం చేసే భూమికి, సేద్యం చేసేవారికి పెట్టుబడి సాయం ఇవ్వడం సమంజసమని, సాగుచేసే వారికి మాత్ర మే రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. ధరణిలో పేరుండి, మోకాపై భూమిలేని వారికి, రియల్ ఎస్టేట్ చేసి, ఇండ్లు నిర్మించిన స్థలాలకు పెట్టుబడి సాయం ఇవ్వరని చెప్పారు. రైతుబంధు పేరిట ఇచ్చే ధనం ప్రజాధనమని, పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులను ప్రభుత్వం రైతుబంధు సాయంగా ఇస్తున్నదని, ఇది దుర్వినియోగం కావద్దని అ న్నారు.
ప్రస్తుతానికి పూర్వపద్ధతిలోనే రైతుబంధు ఇస్తున్నామని, రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలపై పరిశీలన జరుగుతున్నదని తెలిపారు. ఐదు, లేదా పది ఎకరాల వరకు మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నదని, దీనిపై ప్రజలు, రైతులు, రైతు కూలీలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మా ట్లాడుతూ.. రైతుబంధు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల నుంచి రూ.7,500కు పెంచిందని తెలిపారు. భూమి లేకపోయినా వ్యవసాయం చేసే నిరుపేదకు సైతం సాయం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అందులో భాగంగానే రైతుకూలీలకు రూ.12వేల సాయం అని ప్రకటించామని, అవసరమైతే మరో మూడు వేలు పెంచి రూ.15వేల అందజేసే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు.
రైతు రుణమాఫీ విషయంపై పరిశీలన జరుగుతున్నదని జీవన్రెడ్డి తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి మిగిలి ఉన్న రైతుల బకాయిలను మాఫీ చేస్తారని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల పంట రుణమాఫీ అంశాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశీలించే అవకాశాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైస్మిల్లర్ల మెడకు ఉరి పడినట్టయిందని, ఇప్పుడు ధాన్యం తూకంలో తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
రాబోయే యాసంగి పంట నుంచి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. రైతులు మాత్రం ధాన్యం విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ. 12వేల సాయం చేస్తామని ప్రకటించిందని, వీటికి మరిన్ని నిధులు ఇచ్చి నెలకు రూ. 2,500 ఇచ్చే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.