Jeevan Reddy | జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 1 : కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా పెండ్లి సాయం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం అదనంగా ఇవ్వాలనే ఆలోచన తనదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలంలోని తిమ్మపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీ కాలం పూర్తి కావడంతో గురువారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. రెండు హామీలు అమలులోకి రాగా, త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం అమలు చేస్తామని, పెన్షన్స్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నదని, నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం బీసీలైతే రూ.5 లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. బకాయిల కోసం సర్పంచ్లు ఆందోళన చెందవద్దని, ప్రతిపైసా చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.