హైదరాబాద్, డిసెంబర్16(నమస్తే తెలంగాణ): పదెకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకే ప్రభుత్వం రైతుబంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. వందలాది ఎకరాల భూములున్న వారికి, సినీ నటీనటులకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ప్రభుత్వోద్యోగులకు రైతుబంధు ఇవ్వొద్దని తాను గతంలో చెప్పానని, ఇప్పుడూ అదే మాటపై ఉన్నానని స్పష్టం చేశారు.
నెహ్రూ, కేసీఆర్, సోనియా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులని కొనియాడారు. 317 జీవోను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారులే బదనాం చేశారని ధ్వజమెత్తారు. అధికారులు కావాలనే కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టారని, హరగోపాల్ మీద ఉపా కేసు పెట్టారని మండిపడ్డారు. తన దృష్టిలో నిర్బంధం అంటే ఇంద్రవెల్లి ఘటన అని.. ఈ ప్రభుత్వం అలాంటి తప్పు లు పునరావృతం చేయొద్దని హితవు పలికారు.