అందోల్, ఏప్రిల్ 16: పదేండ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ సభలో ఆయన మాట్లాడుతూ.. జై తెలంగాణ అనని, అమరులకు నివాళులర్పించిన ఏకైక సీఎం రేవంత్రెడ్డి అని విమర్శించారు. తెలంగాణను పదేండ్లపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ను నామరూపాల్లేకుండా చేస్తానని మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ చేపట్టిన పనుల ఆనవాళ్లు లేకుండా చేయడంకోసం రేవంత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం, ప్రజలకు అందించిన సుపరిపాలన చేరిపేస్తే చెరిగేది కాదని అన్నారు. ఆంజనేయుడి ఛాతి చీల్చితే రాముడి ఫొటో కనిపించినట్టు రేవంత్రెడ్డి ఛాతి చీల్చితే చంద్రబాబు ఫొటో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా నేతల ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. దేశం గర్వించదగిన విధంగా కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రేవంత్రెడ్డి మాత్రం కనీసం నివాళులర్పించలేదని మండిపడ్డారు.