యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయం ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది, అతి త్వరలో దేశ వ్యాప్తంగా కీర్తిని పొందుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన మండలి విప్ భాను ప్రసాద్ అన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వెన్నవరం భూపాల్ రెడ్డి, భాను ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం మాడ వీధులు, ప్రాకారాలు, కల్యాణ మండపం, గర్భాలయంలోని ముఖ మండపాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా హరిత హోటల్ లో మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం నూటికి 99 శాతం ఆశయాలను సాధిస్తోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలను ప్రభుత్వం బాగు చేస్తుందన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి పూజారులకు జీత భత్యాలు అందిస్తున్నదని తెలిపారు.