నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 5 : బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్టా పాసుపుస్తకాలను ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
ఇక దర్జాగా సాగు: మంత్రి వేముల
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడుభూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలను సాగు చేసుకోవచ్చని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ (డీసీ తండా)లో లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ పోడు భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేస్తుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో 817మంది గిరిజనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోడు పట్టాలు అందజేశారు.
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు..
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని పలు తండాల గిరిజనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి సామ్యాతండాకు చెందిన గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో పోడు భూములకు పట్టాలకు పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.