నిజామాబాద్ : ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్రెడ్డి( CM Revanth Reddy) రైతులకు మాయమాటలు చెబుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి( Vemula Prashant Reddy) విమర్శించారు. బకాయిలు అడిగిన రైతులపై కాల్పులు జరిపింది కాంగ్రెస్ కాదా.. అక్రమంగా కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని, రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలు చెల్లించడమే కాకుండా కాంగ్రెస్ సర్కారు పెట్టిన కేసులను ఎత్తేసిన ఘనత తమదని స్పష్టం చేశారు.
నిజామాబాద్లో(Nizamabad) సోమవారం జరిగిన సభలో రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై చేసిన విమర్శలను ప్రశాంత్రెడ్డి తిప్పికొట్టారు. పసుపుబోర్డు సిసలైనది తెస్తానని మళ్లీ మోసపు మాటలు మాట్లాడి నిజామాబాద్ రైతాంగాన్ని మరోసారి దగా చేయాలని చూస్తున్నారన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపుబోర్డు ఇవ్వడానికి మనసు రాని కాంగ్రెస్.. ఎన్నికల కోసం కల్లబొల్లి మాటలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
పదేళ్లు అధికారంలో ఉండి పసుపుబోర్డు సాధ్యం కాదని చెప్పిన బీజేపీ కూడా.. రైతుల ఓట్ల కోసం పసుపుబోర్డు ఇచ్చామని ప్రధానమంత్రితో అబద్ధపు ప్రకటన చేయించారని మండిపడ్డారు. అబద్ధాల కాంగ్రెస్, బీజేపీలకు పాడి కట్టి సిసలైన రైతు పక్షపాతి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలువాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.