కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 15 : కొండగట్టు దేవాలయ అభివృద్ధికి ఏం చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 24 గంటల్లోగా చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు.
ఒక వేళ ఆయన స్పందించకపోతే హిందూ బిడ్డలందరూ ఆయనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందేనని సుంకె రవిశంకర్ విమర్శించారు. రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోసం చేయడం అవుతుందా ? అని ప్రశ్నించారు. జై శ్రీరాం అనే నినాదం దేశ ప్రజలందరిదని.. కానీ, ఆ నినాదం తమదే అన్నట్లుగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు సిగ్గుండాలన్నారు.
మతం, దేవుళ్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే బండి సంజయ్.. ఆయన నియోజకవర్గంలోని ఏ దేవాలయ అభివృద్ధికి ఏన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వంద కోట్లు ఇస్తే.. తాను రూ.రెండు వందల కోట్లు తీసుకువస్తానని బండి సంజయ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మార్చుతున్నది బీజేపీ నాయకులు, పార్టీయేనని విమర్శించారు. దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన, శ్రద్ధ బండి సంజయ్కి లేదని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు ఎన్నికలు వచ్చిన సమయంలోనే దేవుళ్లు గుర్తుకు వస్తారని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రంలో చెరువులో ఓ దళిత స్త్రీ సాన్నం చేస్తేనే విపరీతంగా కొట్టారని, దళితులను ఓర్వలేని బీజేపీ విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు మంచి చేసే ఒక్క పథకం అయినా మోదీ తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీ నాయకుల్ని తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
హుజూరాబాద్కు వస్తే దళితబంధు ద్వారా ఎంత మంది జీవితాల్లో వెలుగు నిండాయో చూపిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం అభివృద్ది జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం తప్ప.. ఏ రోజు కూడా అభివృద్ధి, సంక్షేమం కోసం బండి సంజయ్ కృషి చేసింది లేదన్నారు. ఎంత సేపూ ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేయటం తప్ప బండి సంజయ్కి మరొకటి తెలియని దుయ్యబట్టారు. ఆలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు.