హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను వరుసగా కొట్టివేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కండ్ల ముందు కనిపిస్తున్నా అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు.
అటు సుప్రీంకోర్టు తీర్పును పరిహసిస్తూ ప్రజాతీర్పును కాలరాస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన సభాపతి.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహించారు. ఓ వైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి.. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్పై దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.
‘పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బలతో కంగుతిన్న కాంగ్రెస్.. ఉప ఎన్నికలంటేనే భయపడుతున్నదని అర్థమైంది.. మున్సిపల్ ఎన్నికల్లోనూ రేవంత్ పాలనా వైఫల్యాలు, మోసాలు, తెరలేపిన స్కామ్లపై పట్టణ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చూసి కాంగ్రెస్ సర్కార్ వణికిపోతున్నదని తేలిపోయింది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ నడిపిస్తున్న వికృత రాజకీయ క్రీడను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారంటూ కేటీఆర్ హెచ్చరించారు.