రంగారెడ్డి : నాడు కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. దేశంలో ఇలాంటి పథకాలు మరెక్కడా లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం(Gold) ఇచ్చే ప్రక్రియ తొందరగా ప్రారంభించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.