హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగా ఈడీ ఈ నెల 15న అక్రమంగా ఈ కేసును నమోదు చేసిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 నంబర్తో నమోదైన ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఇదే కేసులో గుటా వ్యాపారి అభిషేక్, ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్ను కూడా ఈడీ ప్రశ్నించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈడీ కక్ష గట్టిందని, ఆ కేసులో మనీలాండరింగ్ జరగకపోయినా పీఎంఎల్ఏ చట్టం కింద తనపై ఈడీ కేసు నమోదు చేసిందని వివరించారు. ఈ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని రోహిత్రెడ్డి కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉన్నది.
రూ.కోట్లు ఆఫర్చేసి బీజేపీలో చేరమన్నారు..
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు మొయినాబాద్ ఫాంహౌజ్లో కుట్ర జరిగిందని, నలుగురు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎరవేసి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఈ కుట్రపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ 455/2022 నమోదైందని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ను) ఏర్పాటు చేయడంతో నిందితులపై విచారణ ప్రారంభమైందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ హద్దుమీరి తనపై అక్రమంగా కేసు నమోదు చేసిందని, ఎమ్మెలేలకు ఎర కేసుతో ఈడీకి సంబంధం లేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను బయటపడేసేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగానే తన వ్యక్తిగత సమాచారంతోపాటు కుటుంబసభ్యుల సమాచారాన్ని అడుగుతూ పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ఈసీఐఆర్ 48/2022 కేసు నమోదైన రోజే ఈడీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తనకు సమన్లు జారీ చేయడాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కొట్టేయాలని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హైకోర్టును కోరారు. ఆ పిటిషన్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈడీ జాయింట్ డైరెక్టర్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్-హైదరాబాద్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్-హైదరాబాద్ను ప్రతివాదులుగా చేర్చారు.
ఆ కేసు నిందితులతో చెప్పించి.. ఈడీ కేసులో ఇరికించే కుట్ర
ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, తన వ్యక్తిగత సమాచారంతోపాటు కుటుంబసభ్యుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 19న తనను విచారించిన అధికారికి బయట వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయని, వారి సూచనల మేరకే ఈడీ తనను ప్రశ్నించిందని, ఆ విచారణలో తాను ఇచ్చిన సమాధానాలను ఈడీ రికార్డు చేయలేదని తెలిపారు. ఈ నెల 20న మళ్లీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు తనను ఏ కేసు విషయమై ప్రశ్నిస్తున్నదీ తెలియజేయకపోతే జవాబు ఇవ్వబోనని తేల్చిచెప్పానని, అనంతరం మొయినాబాద్ ఫాంహౌజ్లో ఎమ్మెల్యేలకు ఎరపై పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్నిస్తున్నట్టు ఈడీ అధికారి అయిష్టంగానే బదులిచ్చాడని పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేలకు ఎర కేసుకు, మనీ లాండరింగ్కు సంబంధం లేదని, తనపై ఈడీ కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆ అధికారికి వివరించినట్టు తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా చంచల్గూడ జైలులో ఉన్న నందకుమార్ను కూడా ఈడీ ప్రశ్నించిందని, ఆయనతోపాటు ఆ కేసులోని ఇతర నిందితుల నుంచి తనకు వ్యతిరేకంగా వివరాలను రాబట్టి తనను ఈడీ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ జరిగే ఏసీబీ కోర్టులో ఈడీ పిటిషన్ వేసిందని పేర్కొన్నారు.