MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తాను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రఘునందన్ రావు బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్లో ఏదో ఒకటి పదవి ఇవ్వాలి. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా తనకు ఓకే అని చెప్పారు. గత పదేండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు రఘునందన్ రావు.
బండి సంజయ్ది స్వయంకృతాపరాథం అని ఆయన అన్నారు. సంజయ్ పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాంటి సంజయ్ వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావు అని చెప్పారు. రఘునందన్, ఈటల రాజేందర్ బొమ్మలతోనే ఓట్లు వస్తాయన్నారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అని పేర్కొన్నారు. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదు. తాను గెలిచినందుకే ఈటల పార్టీలోకి వచ్చారు. పదేండ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదు. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు పేర్కొన్నారు.
దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయం చేయలేదన్నారు. తాను బీజేపీలో ఉండాలనుకుంటున్నాను. వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే వంద కోట్లు నాకిస్తే.. తెలంగాణను దున్నేసేవాడిని. దుబ్బాకలో తనను చూసే గెలిపించారు అని రఘునందన్ రావు పేర్కొన్నారు.