నస్రుల్లాబాద్, ఏప్రిల్ 7: ‘కొంతమంది ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసమే పార్టీ మారారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేనున్నాననే నాయకులు కావాలి. అదే మనం కేసీఆర్కు ఇచ్చే ధైర్యం’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిస్వార్థంగా సేవలందిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల పాదాలు కడిగి నెత్తిన పోసుకుంటానని అన్నారు. దొంగలు, స్వార్థపరులు పోయారని, చెత్త పోయింది, గట్టి మిగిలిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తన పక్కన ఉండి అన్నీ అనుభవించిన కొందరు నాయకులు ఇప్పుడు పార్టీ మారినట్టు దుయ్యబట్టారు.
తనను మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు. కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.