బాన్సువాడ రూరల్, మార్చి 26: కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో మంగళవారం నిర్వహించిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో పోచారం మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చిందని, రుణమాఫీ, రైతుభరోసా, వరికి రూ.500 బోనస్ సహా మిగతా హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.3 లక్షల కోట్లు కావాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్టే అంత లేదని, మరీ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత భారీ మార్పులు వస్తాయని తెలిపారు.
తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని పనికి మాలిన యూట్యూబ్ చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, పదవులు అనుభవించి పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంటే ఉంటానని తెలిపారు. నలభై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో తన వెంట ఉండి పదవులు అనుభించిన వారు తమ స్వార్థ రాజకీయాలతో పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న చెత్తంతా పోయిందని, ప్రస్తుతం ఆణిముత్యాల్లాంటి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పదేండ్లలో చేసిందేమీ లేదని, ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ కోరారు. బాన్సువాడకు రైల్వేలైన్ తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.