హైదరాబాద్ : తన ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జారీ చేసిన నోటీసులకు భయపడేది లేదు.. తగ్గేది లేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని శుక్రవారం ఉదయం ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈడీ నోటీసు ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉందన్నారు. నోటీసులు నా బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తనకు ఇచ్చిన నోటీసు వెనుకాల కక్షపూరిత చర్యలు ఉన్నాయన్నారు.
బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే తనకు నోటీసులు వచ్చాయి. తనకు నోటీసు వస్తుందని బండి సంజయ్కు ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. ఈడీ నోటీసులపై న్యాయవాదులతో చర్చిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను బయట పెట్టినందుకే ఈడీ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. నీతిమంతులైతే తుషార్, బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధం. బండి సంజయ్ తడిబట్టలతో యాదగిరిగుట్టకు రావాలన్నారు. కర్ణాటక నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు. ఎఫ్ఐఆర్లో తన పేరు లేనే లేదని పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.