చేర్యాల, మార్చి 21 : చేర్యాల( Cheryala) ప్రాంత అభివృద్దే తన లక్ష్యమని, పాత నియోజకవర్గం చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తానాని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దానంపల్లి, చిట్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గ కేంద్రంగా వెలుగెందిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళిమిట్ట ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇటివల చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.
ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ అవుతుందన్నారు. అంతకుముందు ఇటివల రంగనాయక్సాగర్ ప్రాజెక్ట్ ద్వారా అధికారులు దానంపల్లి చెరువులోకి విడుదల చేసిన జలాలకు స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడటమే తన లక్ష్యమని తెలిపాడు.