ధర్మసాగర్, మార్చి 29: స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నిన్ను నమ్మి బీఫామ్ ఇస్తే.. బీఆర్ఎస్ను చూసి ఈ ప్రాంత ప్రజలు నిన్ను గెలిపించుకుంటే.. ఆ పార్టీకే నమ్మకద్రోహం చేసి ఇవాళ పార్టీని వీడుతున్నావు. నీకు దమ్ముంటే.. ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో కొనసాగాలి’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని విధాలా మంచి అవకాశాలు కల్పించారని చెప్పా రు. కడియంను ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన కూతురిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, ఎక్కడా చిన్నచూపు చూడలేదని తెలిపారు. అయినా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి కూతురి కోసం కడియం ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేశారని పల్లా మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్కు, నేడు కేసీఆర్కు వెన్నుపోటు పొడిచాడని ధ్వజెమత్తారు.