చేర్యాల, మార్చి 15 : రైతులంటే కాంగ్రెస్ సర్కారకు అలుసుగా మారిందని, అన్నం పెట్టే అన్నదాతల అక్రందనలు సర్కారు పెద్దల చెవులకు ఎక్కడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని ముస్త్యాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా చేర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమ్మక్క బ్యారేజ్లో గోదావరి జలాలు ఉన్నాయని వాటిని వెంటనే లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్కు పంపింగ్ చేయాలన్నారు. అక్కడ నుంచి బొమ్మకూరుకు నీటిని పంపించి వెంటనే మద్దూరు మండలంలోని లద్నూర్, కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
10 సంవత్సరాలు పాలన సాగించిన కేసీఆర్ ఏ ఒక్కరోజు రైతన్నల పంటలు ఎండిపోనియ్య లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించని పక్షంలో రైతులతో ఉద్యమాలు నిర్మిస్తామన్నారు