హుజూరాబాద్: రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారని.. అయినా ఇప్పటివరకు సాగునీరు రాకపోవడం బాధాకరమన్నారు. ఒక్క ఎకరం ఎండిపోయిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
రైతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ రైతుల ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నీళ్ల ఇబ్బంది ఉండేది కాదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలో అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పంట పొలాలకు నీరు అందించకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎలా తిరుగుతారో చూస్తామన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్ ప్రజలంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వనికి చూపిస్తారని వెల్లడించారు.