Muthireddy | జనగామ : ప్రపంచం అబ్బురపడేలా కేసీఆర్ పాలనా సంస్కరణలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశం ఆచరించేలా తీర్చిదిద్దుతున్న తెలంగాణకు కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు సాధించలేని బీజేపీ నాయకులు చవటలు, సన్నాలు, దద్దమ్మల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. జనగామలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సోమవారం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు.
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రజలకు మేలు చేసే పథకాలు, కార్యక్రమాలు చేపట్టకపోగా ధరలను పెంచడంలో పోటీపడుతున్నారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకొని పరిపాలిస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రమను నమ్ముకొని ప్రజాపాలన సాగిస్తున్నారని చెప్పారు. సృష్టికే ప్రతిసృష్టిగా పారేనదిని ఎదురు మళ్లించి.. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కేసీఆర్కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు దేశం ఆచరించేలా సంస్కరణలు తెస్తున్న బీఆర్ఎస్ అధినేతపై, తెలంగాణ ప్రభుత్వంపై పల్లెత్తు మాటన్నా ప్రజలు ఊరుకోరు ఖబడ్దార్ అంటూ ముత్తిరెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పనికివచ్చే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు అమలు చేసే సంస్కృతి మాదైతే.. ధరలు పెంచి ప్రజల ఆస్తులు అమ్మే సంస్కృతి కేంద్రంలోని బీజేపీదని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడమంటే తుపాకీ రాముడు మాట్లాడినట్లు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డి మాదిరిగా ఎటుపడితే అటు వాగడం కాదని.. ప్రజలకు పనికివచ్చే పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకుపోవడం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దుర్భిక్షం.. దారిద్య్రం చూసిన తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగం ఎంతో ఉందన్న సంగతి మరిచిపోవద్దన్నారు.
ఒకప్పుడు చుక్కనీరందక బీడుగా మారిన భూమలు, బిందెడు నీళ్ల కోసం అల్లాడిన జనగామ కరువుగడ్డ ఇప్పుడు కోనసీమ అయ్యిందంటే స్వరాష్ట్రం వల్లేనని ముత్తిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన ఎనిమిదేళ్లలో వ్యవసాయరంగంలో తెచ్చిన విప్లవాత్మక, వినూత్న సంస్కరణలు, మార్పులు వచ్చాయన్నారు. ఒకనాడు తినేందుకు గంజి మెతుకులు దొరకని తెలంగాణ ఇప్పుడు దేశంలో 130కోట్ల జనాభాలో 100కోట్ల మందికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా ఇన్నీ చేస్తున్న.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ దొంగ మాటలతో మభ్యపెట్టేలా వ్యవహరిస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకోరు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.