హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం అసెంబ్లీలో(Telangana Assembly) మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ప్రతిపక్షాల దాడి నుంచి తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తున్నారని ఆరోపించారు. డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్కషన్స్ పెట్టారు.
31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? మూడు, నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమన్నారు. మేం 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లాం. అందులో ఒకటి, రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, సాగు నీరు, ఉద్యోగాల ఖాళీలు, విద్యా రంగ సమస్యలు, ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తున్నదని విమర్శించారు. కాగా, ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. రేపు పంటల రుణమాఫీపై చర్చ జరగనున్నట్లు సమాచారం.