కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మార్చి 7 (నమస్తే తెలంగాణ): మగతనం అంటే ఎన్నికల్లో గెలవటం కాదని, మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు. ‘రేవంత్.. నువ్వు మగాడివైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకో. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు బాసటగా నిలువు. రైతు భరోసాను అమలు చేయాలి. ఎండుతున్న పంటలు, తడారిన గొంతులకు నీళ్లివ్వాలి. ఆడబిడ్డలకు మహాలక్ష్మి అమలు చేయాలి. దమ్ముంటే కోడలికి రూ.2,500, అవ్వలకు రూ.4000 ఇచ్చి చూపాలి. 100 రోజుల్లో మీ పార్టీ చెప్పిన 420 హామీలు అమలు చేసి చూపించు’ అని అన్నారు. గురువారం కరీంనగర్లో పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో, సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 12న కరీంనగర్లో నిర్వహించే కదనభేరి పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రేవంత్రెడ్డి నీకు దమ్ముంటే సత్తా ఉంటే మగాడివైతే మల్కాజ్గిరికి రా.. నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేసి రా.. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అక్కడనే తేల్చుకుందామని గతంలోనే చెప్పా. మళ్లీ అదే మాట చెప్తున్నా. రమ్మంటే చప్పుడు లేదు’ అని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్రెడ్డేనని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని, రేవంత్రెడ్డి కాంగ్రెస్ అని విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే మరో ఏక్నాథ్షిండే, హిమంతబిశ్వశర్మ ఇక్కడి నుంచే వస్తారని అన్నారు. మహబూబ్నగర్లో రేవంత్ ఆవేశపూరిత మాటలను ప్రజలు గమనించాలని సూచించారు. జేబుల్లో కత్తెర పెట్టుకొని తిరిగేది జేబు దొంగలేనని, ఏ రాజకీయ నాయకుడైనా కత్తెరలు పెట్టుకొని తిరుగుతారా? అని ప్రశ్నించారు. ఇలాంటివాడు సీఎం కావటం మన ఖర్మ అని అన్నారు. ‘రేవంత్రెడ్డీ.. మానవ బాంబులు ఎవరో కావాల్సిన అవసరం లేదు. నీ పక్కన ఉన్న నల్లగొండ, ఖమ్మం కాంగ్రెస్ నాయకులే నీకు బాంబులవుతారు. మీ ప్రభుత్వాన్ని ఏమిచేయాలో వారే చేస్తారు. మీ ప్రభుత్వం ఐదేండ్లు నిక్షేపంగా ఉండాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి 90 రోజులు పూర్తయిందని, ఎన్నికల హామీలను గుర్తు చేసుకోవాల్సిన అవసరమున్నదని కేటీఆర్ అన్నారు. రైతులు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయి ఓట్లు వేశారని, ఇప్పుడు ఆ బాధ వారిలో స్పష్టంగా తెలుస్తున్నదని తెలిపారు. రైతుబంధు రావటం లేదని రైతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు కనీసం రైతుబంధు ఇచ్చే మొఖం, తెలివి సీఎంకు లేవని మండిపడ్డారు. ప్రస్తుత కరవు కాలంతో వచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పుడు బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిచ్చోళ్లు బండి సంజయ్కి, రేవంత్రెడ్డికి ఏమీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ మీద కోపముంటే, బద్నాం చేయాలంటే ఇదా పద్ధతి? రైతుల పొలాలు ఎండాలే, ప్రజల గొంతు ఎండాలే, బతుకులు ఆగం కావాలే, అప్పుడు కేసీఆర్ను తిట్టాలే.. అన్న చిల్లర రాజకీయాలే. ఇదేనా సీఎంకు ఉండాల్సిన పద్ధతి?’ అని ప్రశ్నించారు.
నాటి ఆంధ్రా పాలన మీద సింహగర్జన.. మళ్లీ ఈరోజు అబద్ధాల రేవంత్రెడ్డి మీద 12న కదనభేరి బహిరంగసభను అదే వేదికగా నిర్వహించుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. సభకు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరు కావాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చొక్కారావు, కేసీఆర్, బద్దం ఎల్లారెడ్డి లాంటి మహానుభావులు గెలిచారని, కరీంనగర్ నుంచి ఇప్పుడున్న బండి సంజయ్ ఎలా గెలిచాడో అర్థం కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్పై మొరగటం తప్ప ఒక్క మంచి పని చేశావా? మరి ఎందుకు నీకు ఓటు వేయాలి?’ అని బండి సంజయ్ను ప్రశ్నించారు. తెలంగాణ కోసం గర్జించే గొంతు, పార్లమెంట్లో మన కోసం నినదించే గొంతు వినోద్కుమార్ గెలవాలంటే మనందరం గట్టిగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘ఇంతకాలం దేశాన్ని పందికొక్కుల్లా దొబ్బితిన్నది, దోచుకున్నది ఈ దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులే. వంద రోజులు కాలేదు.. కండ్లు నెత్తికెక్కి కండకావరంతో బలుపు మాటలు మాట్లాడుతున్నరు’ అని నేతన్నలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేకే మహేందర్రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వకుంటే మళ్లీ ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈ వారంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు, బకాయిలు రూ.200 కోట్లు విడుదల చేయకుంటే నేతన్నలతో కలిసి మహాధర్నా చేపడుతామని అన్నారు.
బండి సంజయ్ ఎంపీగా ఈ ఐదేండ్లలో పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై, కరీంనగర్ పార్లమెంట్ సమస్యలపై ఏ రోజైనా మాట్లాడారా అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిలదీశారు. అబద్ధాలు, పిచ్చి కూతలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్ప అభివృద్ధి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, హుజూరాబాద్కు సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్, హుస్నాబాద్కు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సిరిసిల్లకు తుల ఉమ, మానకొండూర్కు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, చొప్పదండికి పెండ్యాల భూపతిరెడ్డిని ఇన్చార్జీలుగా ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు వీళ్లే ఇన్చార్జీలుగా కొనసాగనున్నారు.