హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతానన్న భయంతో సీఎం రేవంత్రెడ్డి ఎన్నడూ లేనివిధంగా దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనందున రేవంత్ తన ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ హామీలను నెరవేర్చలేక ఆయన దేవుళ్లను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని, అందులో భాగంగానే ఇటీవల భద్రాద్రి రాముడితోపాటు మెదక్లోని ఏడుపాయల వనదుర్గాదేవి వద్దకు, చర్చీల వద్దకు వెళ్లి ఒట్లు వేశారని ఎద్దేవా చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందు కు బీఆర్ఎస్ లీగల్ టీమ్తో చర్చిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తథ్యమన్న అసహనంతో రేవంత్ తన ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడాలని హితవు పలికారు.
రైతుల్ని పట్టించుకునే దిక్కే లేదు..
రాష్ట్రంలోని రైతులు అకాల వర్షాలతో ఆగమాగం అవుతున్నారని, కల్లాలతోపాటు కొనుగోలు కేంద్రా ల్లో వడ్లు తడిచిపోతున్నాయని వివేకానంద ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడా పంట కొనుగోళ్లు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వంలో రైతులకు దిక్కు లేకుండా పోయిందని, తాగునీరు, సాగునీరు, విద్యుత్తుపై సమీక్షించే నాథుడే లేడని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మీటింగ్లకే విద్యుత్తు సరఫరా లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్కు దమ్ముంటే ముందు ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్న వీ హన్మంతరావు, సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారికి సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ బీజేపీకిలోకి వస్తాడని చెప్తున్న ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై కూడా సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.
పైరవీలకు అడ్డాగా సీఎం నివాసం
రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ముఖ్యమంత్రి నివాసం కూడా పైరవీలకు అడ్డాగా మారిందని వివేకానంద దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో దేదీప్యమానంగా వెలుగొందిన హైదరాబాద్ నేడు ఎందుకు గోసపడుతున్నదో, రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కుదేలైందో, గత నాలుగు నెలలుగా కొత్త నిర్మాణాలకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో సమాధానం చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను రేవంత్ హోల్సేల్గా అమ్మేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్రెడ్డిపై ఆ పార్టీ క్యాడ ర్ తిరుగుబాటు చేస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో పార్టీకి బలం చేకూరుతుందని, లోక్సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో రోడ్షోలు నిర్వహించనున్నట్టు వివేకానంద తెలిపారు.