దుబ్బాక, మే 20: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫ్యలంతోనే రైతులకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. బుధవారం నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాక మండలం రామక్కపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సూమారు 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించినట్టు తెలిపారు. ఎక్కడ చూసినా రైతుల కన్నీళ్లు, కష్టాలే కన్పించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ మద్దరు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిద్రాహారాలు మానుకుని రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం 20 శాతంలోపే ధాన్యం కొనుగోలు చేపట్టినట్టు తెలిపారు. కల్లాల్లో , కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 80 శాతం వరి ధాన్యం మిగిలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటే.. రైతు, పేదల కష్టాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిందని మండిపడ్డారు. విత్తనాలు మొదలుకొని చివరకు పండించిన పంటను విక్రయించే వరకు రైతులు రొడ్డేక్కి పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొడ్డు రకం వరి కాకుండా వచ్చే వానకాంలో సన్న రకం వరి వంగడాలను సాగు చేయాలని రైతులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వానకాలంలో సన్న రకాల విత్తనాలకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. వరి సన్న రకానికి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ వంగడాలను పండించాలని కోరారు.