దుబ్బాక, మే 2: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంతో సభ వేడెక్కింది. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారని, చివరకు రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పం దించడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు కార్చుతుంటే.. ఇక్కడ ప్రజాపాలన పేరిట సంబురాలు ఏమిటని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభా వేదికపై కుర్చీలో కాకుండా రైతులతో కలిసి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మైక్ తీసుకుని రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండగా, అధికారులు మైక్ కట్ చేశారు. దీంతో మైక్ను విసిరేసి సభ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి మళ్లీ నిరసనకు దిగారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
రైతుల కన్నీరు కనిపిస్తలేదా?
ఓ వైపు ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఏడుస్తుంటే.. మరో పక్క ప్రభుత్వం ప్రజాపాలన పేరిట సంబురాలు నిర్వహించటం సిగ్గు చేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి, మంత్రులకు, కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నం పెట్టే రైతుల సమస్యలు పట్టించుకోకుండా.. మంత్రులు, అధికారులు ఏసీ గదుల్లో ఉంటూ సంబురాల పేరిట కాలం వెళ్లదీయడం దురదృష్టకరమని అన్నారు. కలెక్టర్ కేవలం హుస్నాబాద్కే పరిమతమయ్యారని ఆరోపించారు. ఈ నిరసనలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.