కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 3 : ‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ బస్స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్టీసీ బస్స్టాండ్లను చూస్తే చాలా బాధగా ఉన్నది. రాష్ట్రం మొత్తం బస్స్టాండ్లకు రూ.700 కోట్లు అవుతాయి. దీని కోసం నిధులు ఇవ్వకపోవడం ఏమిటి?’ అంటూ ఆయన ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు కానీ బస్స్టాండ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. కొత్తగూడెం, పాల్వంచ బస్స్టాండ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ, ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. బస్స్టాండ్లలో కనీస అవసరాలు తీర్చాల్సిన అవసరం కూడా ఉన్నదని అన్నారు.