హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యనేత సన్నిహితవర్గం వేసిన ప్లాన్ రివర్స్ అయిందా? సీఎంను పదేపదే విమర్శిస్తున్న ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదు ఆయనకు వరంగా మారిందా? రెండేండ్లలో పొలిటికల్ లాబీయింగ్ ద్వారా జరగనిది ఆ ఒక్క ఫిర్యాదు ద్వారా జరిగిపోయిందా? రాజగోపాల్ మీద క్రమశిక్షణచర్యకు సిఫారసు చేసిన ఫైల్ మీదనే ‘మంత్రి పదవి ఇవ్వండి’ అంటూ ఉల్టా ఆదేశాలు వచ్చాయా? అంటే ఢిల్లీ కాంగ్రెస్ నేతల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి పంటికింద రాయిలా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆదేశించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ‘ఆయనకు మనం మంత్రి పదవి హామీ ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలప్పుడు పార్టీ గెలుపునకు సహకరించారు’ అని రాహుల్ గుర్తుచేసినట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను సమీక్షించి, వీలైనంత త్వరలో రాజగోపాల్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు రాహుల్ సూచించినట్టు తెలిసింది.
సీఎం మీద రాజగోపాల్రెడ్డి వరుస విమర్శలు
రెండో పర్యాయం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భావించారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సంకేతాలు అందటంతో ఆయన సన్నిహితులు ఫ్లెక్సీలు, దండలు, బ్యాండ్బాజాలు సిద్ధం చేసుకున్నారు. కానీ అదే సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అడ్డు తగులుతూ.. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి ఈ లేఖ రాయించారని రాజగోపాల్రెడ్డి అనేక సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇక అప్పటినుంచి ఆయన నేరుగా సీఎం రేవంత్రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేయడం ప్రారంభించారు.
ఎంపీ చామల ఫిర్యాదు
సీఎం రేవంత్రెడ్డిపై రాజగోపాల్రెడ్డి నిరంతరం విమర్శనాస్ర్తాలు సంధిస్తున్న నేపథ్యంలో సీఎం సన్నిహితవర్గం రంగంలోకి దిగింది. రాజగోపాల్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజగోపాల్రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియోలు, వీడియో క్లిప్పింగులు, పత్రికా వార్తలను సేకరించి ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. తమకు అనుకూలంగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజగోపాల్రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలకు ఒత్తిడి చేయించినట్టు తెలిసింది. ఈ విజ్ఞప్తుల మేరకు కేసీ వేణుగోపాల్ ఒక నివేదిక రూపొందించి రాహుల్గాంధీ వద్దకు తీసుకువెళ్లినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
క్రమశిక్షణ చర్యలు వద్దు..మంత్రి పదవి ఇవ్వండి
రాహుల్గాంధీని కేసీ వేణుగోపాల్ కలిసినప్పుడే అసలు కథ మొదలైనట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి పదవి ఇవ్వలేదనే ఒత్తిడిలోనే రాజగోపాల్రెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునేముందే మంత్రి పదవి హామీ ఇచ్చామని రాహుల్గాంధీ గుర్తుచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనకు ఇచ్చిన హామీని గౌరవించాల్సిందేనని, సాధ్యమైనంత త్వరలో మంత్రివర్గంలోకి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే వారి కుటుంబం నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారని, ఉమ్మడి నల్లగొండలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే క్యాబినెట్లో ఉన్నారని కేసీ వివరించినట్టు సమాచారం. సామాజికవర్గాలను సమీక్షించి రాజగోపాల్రెడ్డిని సర్దుబాటు చేయాలని, తెలంగాణ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాహుల్గాంధీ సూచించినట్టు తెలిసింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ప్రత్యామ్నాయ పోస్టుకు సర్దుబాటు చేసి, ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించటానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.