హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు. హిమాచల్ప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. ఆ పార్టీ నాయకులు మతి కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్, అరవింద్పై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లు ఎవరొచ్చినా గల్లీ లీడర్లు రాసిచ్చింది చదువుతున్నారని విమర్శించారు.
అబద్ధమనే ఫ్యామిలీకి పెద్ద బిడ్డ నడ్డా అని విమర్శించారు. రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టారని, అయినా ఒక్క ఊర్లోకూడా నీళ్లు రావడం లేదని నడ్డా అబద్ధాలు మాట్లాడారన్నారు. బీజేపీ నేతల ఏ ఊరికైనా వెళ్దామని, ఇంటింటిలో నల్లా నీళ్లు చూపిస్తామన్నారు. మిషన్ భగీరథ నీటితో స్నానం చేపిస్తానన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులే ప్రశంసించారని చెప్పారు. నడ్డాకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అడ్డగోలు ఆరోపణలు చేశారన్నారు. ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు. బిడ్డా నడ్డా.. తెలంగాణలో నీ నక్రాలు నడవవని హెచ్చరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పిన నడ్డా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అంటే సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ అని ఎద్దేవా చేశారు. వంద ఎకరాల భూమికి లక్షా 20 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడతారా అని విమర్శించారు. నాలుగు బోర్లు వేసుకుంటే నీళ్లు వస్తాయి.. ఆ మాత్రం సోయిలేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో బీజేపీ నాయకులు ఏ టూ జెడ్ స్కాముల్లో ఉన్నారని ఆరోపించారు. గాంధీని తిడతారు, గాడ్సేను కొలుస్తారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయాలంటే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ రిపోర్టును నడ్డా చదువుకోవాలని సూచించారు.