సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో(Parliament elections) ఎగిరేది గులాబీ జెండానే(BRS party) అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండాలో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు.
నల్లగొండ, భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయం తథ్యం అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలకు మోసపోయని ప్రజలు వాపోతున్నారు. కేసీఆర్ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టి ప్రజలకు సంబంధం లేని అంశాలతో కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను విస్మరించిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ నాయక్, పార్టీ అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఉట్కూరి సైదులు, సత్యం, గోవిందరెడ్డి, బాలాజీ నాయక్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.