తుంగతుర్తి, మార్చి 29 : కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై కక్ష గట్టిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, సింగారంతండా, మొండికుంట తండాలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును నిష్ప్రయోజనం చేశారని ఆరోపించారు. నీటిని ఎత్తిపోసి కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు వ్యవసాయం పండుగలా సాగిందని, ఇప్పుడు రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇతర పార్టీల వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడానికి గేట్లు ఎత్తడం కాదని, సాగర్ గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కరువు ఎలా తాండవించిందో ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు లేక కాళేశ్వరం, ఎస్సారెస్పీ ఆయకట్టు ఎడారిలా మారిందని అన్నారు. ఎండిన పంట పొలాలను ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే గానీ వెళ్లి పరిశీలించలేదని చెప్పారు. మంత్రులకు దమ్ముంటే క్షేత్రస్థాయిలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ప్రకృతి తెచ్చిన కరువు కంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తే నేడు రైతులు ఈ దీనస్థితికి చేరుకునేవారు కాదని అన్నారు. కాంగ్రెస్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఎస్సారెస్పీ ఫేజ్ 2 కింద నీళ్లు ఇస్తామని చెప్పి మరీ రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. 15 రోజులు పూర్తి స్థాయిలో ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు రాకపోతే పంట పొలాలు ఎండిపోయి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు ప్రభుత్వం రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సీతయ్య ఉన్నారు.