సిద్దిపేట, ఏప్రిల్ 11: పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టానికి ఎన్నటికైనా శ్రీరామరక్ష బీఆర్ఎస్సేనని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మం డలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యరి ్థ వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచి నిజమైన నేస్తంగా కేసీఆర్ నిలిచారని వెల్లడించారు. సాగునీటి కష్టాలను తొలగించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా, పల్లెల్లోనే ధాన్యం కొనుగోళ్లు, నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా తదితర అనేక రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేసి అన్నదాతలకు చేయూతనిచ్చారని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో నిండా ఉన్న జలాశయాలను.. కాంగ్రెస్ పాలనలో ఎండిపోయి చూస్తున్నామని అన్నారు. కేసీఆర్ కాలుపెడితే పదేండ్లు కరువు లేదని, కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే మళ్లీ కరువును తెచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలోనే ఏపీ నుంచి గడ్డి తెచ్చి పశువులను కాపాడుకున్నామని గుర్తుచేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదని హరీశ్ ఆరోపించారు. ఆ నాడు జై తెలంగాణ అనేవాళ్లను కాల్చిపడేస్తానని అన్నారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి సీఎం కావటం మన దురదృష్టం అని విమర్శించారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 6 గంటల కరెంటు ఇస్తే, కేసీఆర్ రూ.90 వేల కోట్లు ఖర్చుచేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ వల్లే గోదావరి నీళ్లు వచ్చి పంటలు పండాయని, మనం ఇంత అన్నం ముద్ద తింటున్నామని పేర్కొన్నారు.