Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడి.. రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రైతుల పరిస్థితిని చూసి కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ధైర్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులందరూ పంట పొలాల్లోకి వెళ్లండి. మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో పంట నష్టం వివరాలు సేకరించి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరుతున్నాం. ఆ వివరాలు క్రోడికరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆర్థిక సాయం అందించే విధంగా ఒత్తిడి తేవాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. పంట పొలాల్లోకి వెళ్లినప్పుడు రైతులకు అండదండగా ఉంటామని బీఆర్ఎస్ తరపున ధైర్యాన్ని కల్పించాలి అని హరీశ్రావు సూచించారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించారు. రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్. రైతుబంధు కింద 11 విడతల్లో రూ. 75 వేల కోట్ల నగదును బదిలీ చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతుబంధు ఇచ్చాం. రైతుబీమాను తీసుకొచ్చి రైతు చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించాం. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేశాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసి.. సాగుకు నీరందించి రైతు ఆత్మగౌరవాన్ని పెంచాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే రైతులకు కన్నీళ్లు పెట్టించింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రైతుబంధు ఇప్పటి వరకు రైతులకు అందలేదు. రైతులను అసలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రం నుంచి సీఎం, కేంద్రం నుంచి పీఎం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తున్నారు. రాజకీయ చేరికలపై పెట్టిన దృష్టి.. రైతుల భవిష్యత్పై పెట్టాలన్నారు. ఏ నాయకుడిని గుంజుందాం.. ఏ నాయకుడి మీద అక్రమ కేసులు పెడుదాం అనేదానిపై సమయం పెడుతున్నారు. కానీ రైతులను ఆదుకోవాలని దృష్టి సారించడం లేదని హరీశ్రావు పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాలు కాదు.. రైతు ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి నీటి నిర్వహణ లోపం వల్ల గానీ, వడగండ్ల వాన వల్ల కానీ, కరెంట్ సరఫరా లోపం వల్ల గానీ నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఎకరానికి రూ. 25 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాసంగి వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధర కల్పించాలి. రూ. 500 బోనస్ ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలకు, సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ అడ్డురాదు. తక్షణమే నిర్ణయం తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.