గద్వాల, ఏప్రిల్ 15: కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ‘వద్దురో కాంగ్రెస్ సర్కారు’ అంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం గద్వాలలోని పాత బస్టాండ్లో తాగునీటి సమస్య తీర్చాలని, కర్ణాటక నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసి ప్రజల దాహార్తి తీర్చాలన్న డిమాండ్తో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి జలదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపాటు హరీశ్రావు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే బండ్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి గ్యారెంటీల పేరుతో బురిడీ కొట్టించి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను విస్మరించిందని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, తద్వారా కర్రుకాల్చి వాతపెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ఇక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయించాలన్న ధ్యాస రేవంత్ సర్కారుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేయించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీలు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్కు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీశ్ విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ నీటికి, కరెంటు కోసం ఎవరూ దీక్ష చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజుల్లోనే 222 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టి సర్కారు తెరిపించటానికే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి జలదీక్ష చేపట్టారని తెలిపారు. గతంలో నెట్టెంపాడు ద్వారా 20 వేల ఎకరాలకు నీరు పారడమే కష్టంగా ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని వెల్లడించారు.
ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి బీజేపీ తాపత్రయపడుతున్నదని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మంచినీటి సమస్య తీర్చడానికే తాను జలదీక్ష చేపట్టినట్టు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ప్రజలు నీటి కోసం తండ్లాడుతుంటే సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజలను గారడీ చేసిందని దుయ్యబట్టారు. నడిగడ్డ ప్రజల దాహార్తి తీర్చడానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జలదీక్ష చేపట్టారని తెలిపారు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన గాలికొదిలి కొందరు ఏసీ గదుల్లో ఉంటుండగా, మరికొందరు క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు గోస పడుతున్నారని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనే 2,500 ఎకరాల్లో పంట నష్టపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. నడిగడ్డలో 99 శాతం ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్కుమార్కే వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కొల్లాపూర్ ఇన్చార్జి అభిలాశ్రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.