యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ అంటేనే లీక్లు, ఫేక్ న్యూస్లు అని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీని ఎన్నికల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. గ్యారెంటీలు అమలు చేయకుండా, జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో హస్తం పార్టీ మెడలు వంచాలని అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పాలనను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నదని, పార్టీలో చేరికలతో బిజీ అయ్యిందని విమర్శించారు. మహిళలకు రూ.2,500, ధాన్యానికి రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి, నిరుద్యోగభృతి, రూ.4 వేల పింఛన్.. ఇలా అనేక హమీలు నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
‘కేసీఆర్ బయటకు రాగానే కాళేశ్వర జలాలు దుంకుతున్నాయి. నాగార్జునసాగర్ నీళ్లు వదిలారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లను కాల్వల్లోకి మళ్లించారు. కొంతమంది నేతలు స్వార్థంతోనే పార్టీ మారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారంతా మూడోస్థానంలో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కరెంట్, నీటి బిల్లులు పెరుగుతాయి. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ఏకంగా రాహుల్గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అతడితో భువనగిరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అని హరీశ్రావు సూచించారు.
‘200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. రైతుల్లో ఆత్మైస్థెర్యం కల్పించే ప్రయత్నం చేయలేదు. ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకుంటుంటే పట్టించుకుంటలేదు. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. కాంగ్రెస్ నేతలకు కండువాలు కప్పడంపై ఉన్న సోయి.. పరిపాలనపై లేదు’ అని హరీశ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీకి గులాంగిరీ చేసే పార్టీలు. లక్ష్యం కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్. ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. కాంగ్రెస్ ఐదేండ్ల కంటే ఎక్కువ అధికారంలో ఉండదు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పైరవీకారులు, పవర్ బ్రోకర్లే పార్టీ మారుతున్నరు. ఆత్మగౌరవం గల కార్యకర్తలు, ఉద్యమకారులు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరేం చేయలేరు. పార్టీ గెలుపు కోసం వచ్చిన భువనగిరి కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మిమ్మల్నే నాయకులను చేసుకుంటాం’ అని వెల్లడించారు.
దేవుడి పేరుతో రాజకీయాలు చేయటం కాదని, ప్రజలకు చేసిన మేలేమిటో చెప్పాలని బీజేపీని హరీశ్ డిమాండ్ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ‘జట్టు కట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండా ఎగురుతుంది. పార్టీ నుంచి పోయిన నలుగురు కూడా ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితం అవుతారు. కాంగ్రెస్ మోసాలను చూసి ప్రజలు కసిగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. అప్పుడే అసెంబ్లీలో కొట్లాడటానికి ఉంటుంది. ఇస్తవా.. ఇయ్యవా అని నిలదీసి అడగొచ్చు’ అని అన్నారు. కల్లబొల్లి మాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. క్యాబినెట్లో ఉన్నోళ్లు పైసలతోనే మంత్రి పదవులు కొనుక్కొన్నారని ఆరోపించారు.