పాలమూరుకు అర్జంటుగా సాగునీరు కావాలంటే క్షణాల్లో శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకునేవాళ్లం. నల్లగొండకు తాగునీరు కావాలంటే సాగర్ ఎడమకాల్వ గేట్లెత్తేవాళ్లం. అంతెందుకు, అర్ధరాత్రి అవసరమైతే.. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తుకేంద్రంలో అవసరానికి అనుగుణంగా కరెంటు ఉత్పత్తి చేసుకునేవాళ్లం.ఇదంతా గతం! ఇప్పుడిదంతా ఖతం!
పాలమూరులో ఎకరం తడవాలన్నా.. నల్లగొండకు గుక్కెడు నీళ్లు కావాలన్నా.. కరెంటు ఉత్పత్తి చేసుకోవాలన్నా.. కృష్ణా బోర్డు అంగీకరించాల్సిందే! కేంద్రం కనికరించాల్సిందే!!
తెలంగాణ ప్రయోజనాలను రక్షించే విషయంలో, ప్రాజెక్టులను కాపాడే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లుగా చైనాగోడలా దృఢంగా నిలబడింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే శ్రీశైలం, సాగర్ చేజారినయ్. రేవంత్ సర్కారు తన వ్యూహరాహిత్యంతో ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి ధారాదత్తం చేసింది.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్న వార్త తెలంగాణవాదులను కలవరపరుస్తున్నదని అన్నారు.
ఆ వార్తలే నిజమైతే తెలంగాణ అసాధారణ స్థాయిలో నష్టపోతుందని, రాష్ర్టానికి ఇప్పటివరకు విద్యుత్తు విషయంలో ఉన్న స్వయంప్రతిపత్తి తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని హితవు పలికారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేసిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ ట్యాగ్లైన్గా నీళ్లు, నిధులు, నియామకాలు అని నిర్ణయించారని.. అందుకు అనుగుణంగానే తాము పనిచేశామని పేర్కొన్నారు. ఉద్యమకారులుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఆ తరువాతే రాజకీయాలని తేల్చిచెప్పారు.
కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు లాభం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వచ్చిన మీడియా కథనాలను ఆయన ప్రదర్శించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నదని, పర్యవసానంగా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళుతున్నాయని వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.
‘ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని 2015 జూన్ 15న కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ను కేసీఆర్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతీ సమావేశంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రాజెక్టులను ఏకపక్షంగా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావటానికి ఒప్పుకోబోమని తేల్చిచెప్పాం. తెలంగాణ న్యాయబద్ధ హక్కులు దక్కిన తరువాతే ఒప్పుకుంటామని స్పష్టం చేశాం. కేంద్రానికి నాడు కొన్ని ప్రతిపాదనలు చేశాం. వాటికి ఒప్పుకుంటేనే కేఆర్ఎంబీ పరిధిలోకి చేర్చాలా? వద్దా? అని ఆలోచిస్తామని కేసీఆర్ సర్కార్ కుండబద్దలు కొట్టింది’ అని హరీశ్రావు వివరించారు.
కొత్తవి తెస్తామని వెళ్లి ఉన్నవి ఇచ్చేసి వస్తారా?
ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసేందుకు కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే తాము అపెక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశామని హరీశ్రావు తెలిపారు. అపెక్స్ కమిటీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా, ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
నదీ జలాల పంపిణీలో ఎదురయ్యే సమస్యలను కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల శాఖ తేల్చలేనప్పుడు అపెక్స్ కమిటీకి రిఫర్ చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నదని, ఈ నేపథ్యంలో తాము అపెక్స్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి వెళ్లిని సీఎం రేవంత్, ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రక్షణలు, హక్కులను చూసుకోకుండా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పుకున్నదని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే మీడియాలో కథనాలు వస్తున్నా ప్రభుత్వ పెద్దలెవరూ స్పందించకపోవటంతో తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.
5 వేల మెగావాట్ల కరెంటు చేజారిపోతుంది
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించటం వల్ల విద్యుత్తు ఉత్పతిలో తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని హరీశ్రావు హెచ్చరించారు. 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు, 815 మెగావాట్ల నాగార్జునసాగర్ మెయిన్ పవర్ హౌజ్, నాగార్జునసాగర్ ఎడమకాలువ మీద ఉన్న 60 మెగావాట్ల యూనిట్లు కలిపి 1,775 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదని ఆరోపించారు.
గత తొమ్మిదిన్నరేండ్లుగా అటు జల విద్యుత్తు, ఇటు థర్మల్ విద్యుత్తును బ్యాలెన్స్ చేస్తూ గ్రిడ్ కుప్పకూలకుండా కాపాడామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని జల విద్యుత్తు స్టేషన్ల నుంచి సగటున 5000 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తీసుకున్నామని చెప్పారు. జలవిద్యుత్తు యూనిట్కు రూ.2.50 అయితే, థర్మల్ విద్యుత్తుకు రూ.5.50 అవుతుందని, చౌకగా లభించే హైడల్ పవర్ను వదిలి థర్మల్ పవర్ వైపు వెళ్లటం వల్ల రాష్ర్టానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
టేల్పాండ్లో నాన్పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువైనా, తక్కువైనా గ్రిడ్ కుప్పకూలుతుందని, రివర్స్ పంప్ చేసి టేల్పాండ్ నడపాలన్నా కేంద్రానికి దరఖాస్తులు పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. టేల్పాండ్ ద్వారా కేసీఆర్ సర్కార్ గత పదేండ్లలో రివర్స్ పంపింగ్ ద్వారా 300 టీఎంసీలను వాడుకున్నదని వివరించారు.
గ్రిడ్ కుప్పకూలితే రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించి తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీ, కాంగ్రెస్లేనని హరీశ్రావు మండిపడ్డారు. 250 రోజులు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని తెలంగాణకు రాకుండా రెండు జాతీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాగర్ ఆయకట్టుకు తీరని నష్టం
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు శ్రీశైలం ద్వారా ఏపీకి నీళ్లు తీసుకెళ్తారని, బచావత్ ట్రిబ్యునల్లో ప్రాజెక్టువారీగా కేటాయింపులు కాకుండా రాష్ట్రం వారీగా చేయటంతో కృష్ణాడెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని తరలించుకుపోతున్నారని, సాగర్ ఆయకట్టుకు నీళ్లులేకుండా చేసే కుట్రలు సాగుతున్నాయని హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
‘ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్లో తాగునీటి కష్టాలు మొదలవుతాయి. మిషన్ భగీరథ నీటికి కష్టకాలం దాపురించబోతున్నది. నిర్మాణంలో ఉన్న పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే మనకు మనమే ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది.
కొత్త ప్రాజెక్టుల ఊసేలేకుండా పోతుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశాలను రాజకీయ కోణంలో కాకుండా తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలు, హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే తాము పోరాటానికి సిద్ధమవుతామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయాలు కాదని తేల్చి చెప్పారు.
మోటర్లను తరుచూ ఆన్ అండ్ ఆఫ్ చేయొద్దు
కాళేశ్వరం సహా ఇతర ఎత్తిపోతల పథకాల్లో మోటర్లను తరుచూ ఆన్ అండ్ ఆఫ్లో వాడుతున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, పెద్దపెద్ద మోటర్లను అలా నడపటం వల్ల వాటి సామర్థ్యం, జీవనకాలం దెబ్బతింటదని సాంకేతిక నిపుణులు చెప్తున్నారని హరీశ్రావు తెలిపారు.
ఒక పంప్ హౌజ్లో నాలుగు మోటర్లు ఉంటే కరెంట్ తక్కువ ఉన్నప్పుడు రెండు లేదా ఒకటి నడపాలని సూచించారు. అలా కాకుండా మోటర్లను రోజుకు రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారని, తద్వారా మోటర్లు రిపేర్లు రావడం, సామర్థం తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించారు. ఆన్ అండ్ ఆఫ్లో నడపటం ద్వారా ఎత్తిపోతల పథకాలే దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణకు తీరని నష్టం
కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయాలని సుప్రీం కోర్టు గడపతొక్కిన కారణంగానే కేంద్రం దిగివచ్చిందని హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ పలుమార్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఒప్పించిన తర్వాతే కేంద్రం కొత్త ట్రిబ్యునల్ వేసిందని చెప్పారు. అపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
1. విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కోల్పోతుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ తెలంగాణ చేతిలో ఉన్నది. దీని వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నది. కేఆర్ఎంబీ పరిధిలోకి పోతే ఆ అవకాశం ఉండదు.
2. నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద తెలంగాణలో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇదంతా తీవ్ర ప్రమాదంలో పడుతుంది.
3. హైదరాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ ప్రాంతాలకు తాగునీటికి సమస్య వస్తుంది.
4. నిర్మాణంలో ఉన్న పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీసహా పలు ప్రాజెక్టులపై ప్రభావం పడుతుంది. కేఆర్ఎంబీ చేతికి వెళితే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందు అనుమతులు తీసుకోవాలి. సీడబ్ల్యూసీ, అపెక్స్ కమిటీ అనుమతులు తీసుకున్న తరువాతే వీటిని కట్టాలని షరతు పెట్టే ప్రమాదం ఉన్నది. దీంతో ఆ ప్రాజెక్టుల ఉనికే ప్రశ్నార్థమవుతుంది.
5. భవిష్యత్తులో కృష్ణానది పరీవాహక ప్రాంతం లో కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేఆర్ఎంబీని తెలంగాణ అడుక్కోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది.
కేంద్రానికి కేసీఆర్ సర్కారు చేసిన ప్రతిపాదనలు
మన హక్కులు కృష్ణార్పణం
పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీలాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలుపెట్టి ఆపే ప్రయత్నం చేస్తే పురోగతి దెబ్బతిని రేపు మన మెడకు మనమే ఉరితాడు వేసుకున్నైట్టెతది. పర్యవసానాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టిపెట్టిందా? ప్రాజెక్టులు పోతున్నయని పత్రికలన్నీ పతాక శీర్షికల్లో రాస్తున్నయ్. కరెంటు పోతదని వార్తలు వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అనిపిస్తలేదు.
తెలంగాణ ఏర్పాటు సమయంలోనే లోయర్ సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించి బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేశాయి. 250 రోజులు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని తెలంగాణకు రాకుండా రెండు జాతీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయి. ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తున్నయి. చౌకగా లభించే హైడల్ పవర్ను చేజేతులా కేంద్రం చేతిలో పెడుతున్నయి.
– మాజీ మంత్రి హరీశ్రావు