సంగారెడ్డి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఫేక్ వీడియోల ఆధారంగా అబద్ధాలు ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గోబెల్స్ ప్రచారం చేసినందుకు వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేయాలి’ అని మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ రోడ్షో నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ మాట్లాడుతూ.. ఫేక్ వీడియో ప్రచారంపై బుధవారం (మే 1న) ఢిల్లీ రావాలని అక్కడి పోలీసులు నోటీసులు ఇచ్చారని, రేవంత్ పాపం పండిందని అన్నారు.
ఫేక్ వీడియోల ద్వారా అబద్ధపు ప్రచారం చేసినందుకు అస్సాంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారని, అదే తరహాలో రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డిని అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డి కలిసిపోయినట్టు తేలిపోతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్పైనా రేవంత్ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ అన్నారు. ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లతో ఓట్లు వేయించుకొని మోసం చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు గాడ్ ప్రామిస్లతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2,500, రూ.4 వేల ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, నిరుద్యోగభృతి ఇస్తామని ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజల తరఫున పోరాడి ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలయ్యేలా చూస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే బలం వస్తుందని వెల్లడించారు.
సంగారెడ్డి ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. మాజీ ఐఏఎస్ అయిన వెంకట్రామిరెడ్డి ప్రజల కోసం పనిచేస్తారని, రూ.100 కోట్ల ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకువస్తారని వివరించారు. దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దుబ్బాక ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్రావు ఇప్పుడు కొత్త హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్షోలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, రాజేశ్వర్రావు దేశ్పాండే, రాజేందర్, శివరాజ్పాటిల్, కోడూరి రమేశ్, చీలమల్లన్న తదితరులు పాల్గొన్నారు.