గజ్వేల్/సిద్దిపేట అర్బన్, మే 11: పదేండ్లలో కేసీఆర్ 50 ఏండ్ల అభివృద్ధి చూపిస్తే..ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని ఐదేండ్లు వెనక్కి తీసుకుపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాభివృద్ధి జరుగాలంటే.. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే.. పార్లమెంట్లో తెలంగాణగొంతు వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్షోలో నిర్వహించి, సిద్దిపేటలోని తన నివాసంలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం కొట్లాడే బీఆర్ఎస్నే ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోలు ఉద్యమం నాటి రోజులను గుర్తు చేశాయని అన్నారు. ప్రజలు కేసీఆర్ సభకు ఎండలను సైతం లెక్కచేయకుండా నీరాజనం పట్టారని చెప్పారు. చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డట్టు.. కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ కావడంతో శిక్ష వేయాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటెందుకు వేయాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో పుట్లకొద్దీ వడ్లు పండితే.. కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతున్నదని, తెలంగాణ ప్రజలకు ఖచ్చితమైన గ్యారంటీ బీఆర్ఎస్ పార్టీయేఅని, కేసీఆర్ గ్యారంటీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని తెలిపారు.
కేసీఆర్ ఉన్నపుడు రైతుల విలువ పెంచి.. రైతుల భూముల విలువ పెంచారని, కానీ నేడు కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గించి.. భూముల విలువ కూడా తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఉన్న తేడా అని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్ను ఇష్టమెచ్చినట్టు రేవంత్రెడ్డి తిట్లు తిట్టడం మర్యాదేనా? అని హరీశ్రావు ప్రశ్నించారు. జననేత కేసీఆర్ను తిట్టిన రేవంత్రెడ్డికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్ మాజీ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.