సిద్దిపేట/కరీంనగర్, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్సేనని, ఎంపీలుగా గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలు అవుతారని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు కొండం సంపత్రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశంలో, కరీంనగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీఆర్ఎస్కే ఉన్నదని తెలిపారు. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్తోపాటు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నదని విమర్శించారు. ‘మొన్నటిదాకా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. బడేభాయ్, చోటే భాయ్ బంధం బలపడుతున్నది. చీకటి ఒప్పందంలో భాగం గా కరీంనగర్లో వినోద్కుమార్ గెలవకుండా కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్ట నుంది. అందుకే ఇప్పటి వరకు ఈ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు’ అని ఆరోపించారు.
‘సీఎం రేవంత్రెడ్డి వద్ద సరుకు లేదు. పనిలేదు. అందుకే లీకులు, ఫేకు వార్తలు వ్యాప్తి చేస్తున్నడు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పనిజేసిండు. అధికారంలోకి వచ్చాకా అదే పని చేస్తున్నడు. బీఆర్ఎస్పై అక్కసు వెళ్లగక్కుతూ కాలం వెళ్లదీస్తున్నడు తప్ప, ప్రజలకు ఏం చేస్తలేడు’ అని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలే అయినా, ప్రజలకు విసుగు వచ్చిందని తెలిపారు. రైతులకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ‘ఎన్నికల ముందు వడ్లకు క్వింటాలుకు రూ.2,500 ఇచ్చి వడ్లు కొంటామని చెప్పారు. మరి కొంటున్నారా? బోనస్ ఎక్కడపాయె? మీ హామీలు ఎమాయ్యాయి?’ అని సీఎంను ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి ఉద్యమంలోగానీ, ఇప్పుడు గానీ జై తెలంగాణ అని అనలేదని, కనీసం అమరుల స్థూపానికీ నివాళి అర్పించలేదని హరీశ్ విమర్శించారు. ‘ఆనాడు రేవంత్రెడ్డి తుపాకీ పట్టుకుని కరీంనగర్ సభకు వచ్చిన విషయాన్ని ఇక్కడి ప్రజలు మర్చిపోతారా? తెలంగాణ అని అనేది ఎవ్వడురా అని అనలేదా? దురదృష్టవశాత్తు ఇలాంటి వ్యక్తి ఈ రాష్ర్టానికి సీఎం అయ్యారు’ అని ఆరోపించారు. కేసీఆరే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, ఇప్పుడు రేవంత్రెడ్డి కూర్చున్న సీటు ఆయనకు దక్కేది కాదని తెలిపారు. అంతటి నాయకుడిని పట్టుకొని రేవంత్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
పేదల వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక పార్టీ బీజేపీ అని హరీశ్ ఆరోపించారు. పదేండ్లలో ఎన్నడూ తెలంగాణ అభివృద్ధికి సహకరించని పార్టీ అని మండిపడ్డారు. ఏనాడు రైతులు, ఇతర వర్గాల వారి కోసం ఆ పార్టీ మాట్లాడలేదని విమర్శించారు. అలాంటి పార్టీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటంలో బీజేపీ బడేమియా అయితే, కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతుకలైన వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా, వినోద్కుమార్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు.
తాను మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం పార్లమెంట్లో 32 పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశానని వినోద్కుమార్ గుర్తుచేశారు. రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలిచాక తెలంగాణ అభివృద్ధికి కృషి చేశానని వెల్లడించారు. 106 సార్లు పార్లమెంట్లో మాట్లాడానని తెలిపారు. కరీంనగర్కు అర్హత లేకున్నా స్మార్ట్ సిటీని సాధించానని, మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెనకు నిధులు తెచ్చానని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు చేయించానని వివరించారు. బండి సంజయ్ ఒక బడి తెచ్చారా? ఒక గుడి తెచ్చారా? అని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిస్తే రావాల్సిన నిధులను కొట్లాడి తెస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్లో వినోద్కుమార్, అసెంబ్లీలో తాను ఉండాలని, అప్పుడే డబుల్ ఇంజిన్ డోస్తో పట్టుదలతో పనిచేస్తామని తెలిపారు. సమావేశాల్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, మేయర్ సునీల్రావు, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.