Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇక ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యంగ్యం ఎక్కువైంది.. వ్యవహారం తక్కువైందంటూ రేవంత్కు హరీశ్రావు చురకలంటించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు.
చాలా చిన్న వయసులో సీఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారు. కాబట్టి వ్యంగ్యం తగ్గించుకోని, వ్యవహారం మీద దృష్టి సారించాలని సీఎంకు సూచిస్తున్నాను. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది. వ్యవహారం తక్కువైంది. చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తాం అని హరీశ్రావు చెప్పారు.
ఈ రోజు గొప్పదినం. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణం. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే.. ఈ రోజు కేంద్రం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏగక్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి. మన పీవీ గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ ఘాట్ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేశాం. పీవీ కుమార్తె సురభి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చాం. పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాం. భారతరత్న ఇవ్వాలని నినందించం.. అది నిజం కావడం మనందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరుతున్నాను అని హరీశ్రావు పేర్కొన్నారు.