Harish Rao | హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాపాలన..? అని నిలదీశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, మార్షల్స్ కలిసి అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై హరీశ్రావు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు అని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం.. అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు.