హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : ‘ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమైనయ్. ఐదు నెలల్లోనే రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా?’ అని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదని, విత్తనాలను కూడా రైతులకు అందించలేని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరిందని దుయ్యబట్టారు. రైతులపై లాఠీలు ఝుళిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందుల్లేకుండా విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ ఘటన జరిగి మంగళవారానికి 14ఏండ్లు అంటూ ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎకుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయన్నారు. తుపాకీ తూటాలకు దీటుగా తిరగబడ్డాయని, పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమ కారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారని కొనియాడారు. స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పారని, తుపాకీ తూటాలకు కూడా వెరవలేదని, లాఠీలకు భయపడలేదని గుర్తుచేశారు. ఆ చారిత్రక సన్నివేశాలు ఇంకా తన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని, చరిత్రపుటల్లో అవి చిరస్థాయిగా నిలిచిపోతాయని, భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని చాటుతాయని పేర్కొన్నారు.