హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలు మానుకొని, రాష్ట్రంలో కరువు పర్యటనలు చేయాలని, రైతులకు భరోసా కల్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో తెచ్చిన కరువు కారణంగా రైతులు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తక్షణమే వ్యవసాయ, సాగునీటి శాఖలపై సమీక్షలు చేపట్టి, రైతులను ఆదుకోవాలని కోరారు. తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లు లేక రైతులు అల్లాడిపోతుంటే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మానవబాంబులను తయారుచేయడానికి ఉగ్రవాదివా? పేగులు మెడలో వేసుకొని తిరగడానికి కసాయోడివా? ముఖ్యమంత్రివా..?’ అని ప్రశ్నించారు. ‘మూడు నెలల అసమర్థ పాలన వల్ల లక్షలాది రైతుల పేగులను మెడలో వేసుకున్నవ్.. ఆ పాపం ఊరికే పోదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మార్క్ మార్పుతో మూడు నెలల్లోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని ఎద్దేవా చేశారు.
కర్ణాటక నుంచి నీళ్లు తేవాలి
కాంగ్రెస్ నేతలు నిష్ప్రయోజనంగా మార్చుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నదని జగదీశ్రెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉన్నదని, అక్కడి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకొనిరావాలని కోరారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి ఢిల్లీ పెద్దల ద్వారా కర్ణాటక నేతలతో మాట్లాడించి నీళ్లు తెచ్చే దమ్ములేదని దుయ్యబట్టారు. గతంలో రైతులు కేసీఆర్పై భరోసాతో ఉండేవారని, ఎలాగైనా అన్ని పంటలకు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో ఉండేవారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెడుతున్నదని మండిపడ్డారు. నీళ్లు లేక రైతులు పంటలను పశువుల మేతకు వదిలే దారుణ పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు ఎండిపోతుంటే నల్లగొండ మంత్రులకు, ముఖ్యమంత్రికి సోయిలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ దుస్థితి ఉండేదా? అని ప్రశ్నించారు. పంటలపై నాడు తమకొక అంచనా ఉండేదని, నేటి ప్రభుత్వానికి ముందస్తు అంచనా ఏమీలేదని దుయ్యబట్టారు. ఢిల్లీకి ముడుపులు, మూటలు సర్దడంపైనే కాంగ్రెస్ నేతలకు ముందుస్తు ప్రణాళిక ఉన్నదని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలి
కేసీఆర్ నిర్మించిన బ్రిడ్జీలకు శంకుస్థాపనలు చేయడం, ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టడం, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇవ్వడం కాదని, సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని జగదీశ్రెడ్డి సవాల్ చేశారు. ప్రాజెక్టులు నీటికి కొట్టుకుపోతే బాగుండనే దుర్మార్గపు ఆలోచన ఇకనైనా మానుకోవాలని హితవు చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై కేసులు పెట్టడం, చిత్రహింసలకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. మంచినీళ్లు లేవని, సాగునీరు లేక పొలం ఎండిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసు పెట్టిస్తవా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ చర్యల వల్ల గ్రామాలతో సహా హైదరాబాద్కు సైతం తాగునీటి సమస్య రాబోతున్నదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, బీఆర్ఎస్ నాయకులు ఊర నర్సింహారెడ్డి పాల్గొన్నారు.