హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనులు (Singareni coal mines) వేలానికి పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మోదీ దోస్త్ అదానీకి (Adani) సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బండి సంజయ్ (Bandi Sanjay) అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మూడుసార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. మళ్లీ నాలుగోసారి 4 బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
సింగరేణిని ప్రైవేటీకరించవద్దని (Privatisation) ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించకపోతే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పిన మాటమీద నిలబడటం లేదని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థకు గనులు కేటాయించాలన్నారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను సింగరేణి ప్రాంతాల్లో తిరుగనివ్వరని హెచ్చరించారు.
పేపర్ లీకేజీల వ్యవహారం వెనుక కేంద్రం పెద్దల హస్తం ఉందని బాల్క సుమన్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎవరీ వదలొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని విమర్శించారు. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ విధానాలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.