గోదావరిఖని, నవంబర్ 11: ‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని అవమానిస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని చెప్పారు. శుక్రవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
గని కార్మికులపై ప్రేమ ఉంటే సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని, ఆదాయ పన్ను రద్దు చేయాలని, పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని, 11వ వేతన ఒప్పందం ప్రకారం వేతనాల పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ఆర్భాటపు ప్రచారం కోసం ఇక్కడికి వస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మోదీ ముందు మోకారిల్లుతున్నారని, అభివృద్ధిని విస్మరించి ఆయన చెప్పులు, బూట్లు మోసే పనిలో నిమగ్నమయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటకలో సీఎంకు ఎలా గౌరవం ఇచ్చారో? పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలుస్తున్నదని, తెలంగాణ అంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు.