హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి బాల్క సుమన్ టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపలేదని అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని, ఈ అంశంపై లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడారని గుర్తు చేశారు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడిన అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు.
కుటుంబ పాలనపై అమిత్ షా మాట్లాడిన మాటలు గురివింద గింజ సామెత మాదిరిగా ఉన్నాయన్నారు. బీజేపీలో ఎంత మంది వారసులు పదవుల్లో లేరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. అనంతరం ఏర్పడ్డ ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటే తప్పెలా అవుతుందన్నారు. క్రికెట్ అంటే తెలియని, అసలు ఆటే రాని అమిత్ షా కుమారుడు బీసీసీఐ పదవిలో ఎలా ఉంటాడు? అని ప్రశ్నించారు. దమ్ముంటే కుటుంబ పాలనను నిషేధిస్తూ బీజేపీ కార్యవర్గంలో తీర్మానం చేయాలని సుమన్ డిమాండ్ చేశారు.
రెండు జాతీయ పార్టీల సభల్లో జై తెలంగాణ నినాదం ఊసే లేదని సుమన్ గుర్తు చేశారు. వరంగల్ సభలో బీజేపీని రాహుల్ ఒక్క మాట కూడా అనలేదు. అమిత్ షా కూడా కాంగ్రెస్ పార్టీ పేరే ఎత్తలేదు.. దీన్ని బట్టే తెలంగాణపై ఆ రెండు పార్టీల కుట్ర అర్థమవుతోందన్నారు. తెలంగాణ పచ్చ బడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి.. కడుపులు మండుతున్నాయని సుమన్ ధ్వజమెత్తారు.